Tuesday, February 21, 2012

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

              
బ్రాహ్మీమయ మూర్తి .మహాకవిసామ్రాట్టు..విశ్వనాధ సత్యనారాయణ

      ''తన కావ్యం ప్రతివాడూ గొప్పదంటాడు. ఎవరో నా 'ఏకవీర' ఉత్తమమని అన్నారు..నేను ఉత్తమమని ఎందుకనాలి?ఒక తరం పోయి మరొక తరం వచ్చినట్టు చెప్పిన'వేయి పడగలు' గొప్పది కాదా? దాని గుణ గణాలు ఎవరైనా పరిశీలించారా?ఎంతో సైకాలజీ గుప్పించిన 'చెలియలి కట్ట' ఏమైనట్టు? 'పురాణ వైర గ్రంధ మాల' లో ఒక్కొక్క నవలలో ఒక్కొక్క శిల్పం చూపానే! ఎవరైనా చూశారా? మన ప్రమాణాలునిలుస్తాయా? ఎంతో పోయె..దేవాలయాలే కూలి పోయె! ''...అని కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పిన వాడు..
       ''రామాయణ కల్ప వృక్షాన్ని మించిన కవిత్త్వం ఉండదు..సర్వ శక్తులూ పెట్టి వ్రాశాను..పరమేశ్వరుడు అనుగ్రహించాడు..నారాయణుడే పరమేశ్వరుడు..'' అన్న ధీశాలి, జ్ఞాని...జ్ఞాన పీఠానికి ఘనతను తెచ్చిన ప్రజ్ఞాన ఖని..  '' సనాతన ధర్మం రాదు..కానీ..వేద మతానుసరణం తప్పదు..ఆది వినా ప్రపంచ శాంతిఉండదు..ఏ ఇజమూ గట్టెక్కించదు ..వేదిజం ఒక్కటే శరణ్యం..'' అని నిష్కర్షగాచెప్పిన వాడు... ''ఇంగ్లీషు లో ఏ రవీంద్రుడి లాగానో..ఇలియట్స్ లాగానో కవితా భాష వ్రాసే అలవాటుపోయింది..సంస్కృతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యిన్నొకటో వాడినో అవుతాను..తెలుగులో నంటారా..పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తర్వాతపదమూడవ వాడిని నేను..'' అని రొమ్ము విరుచుకుని చెప్పగలిగిన దమ్మున్నదక్షుడు..

            ఒక ప్రసిద్ధ కవి, విమర్శకుడు, పాత్రికేయుడు ఐన వారి మాటలలో ..'' లక్షన్నరపేజీలకు పైగా తన రచనలను చేసిన వాడు..ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు..భారత దేశంలోనేవేరే ఏ కవికీ వారికున్నంత ప్రాచుర్యం లేదు..ఆధునిక కాలంలో..'' అని పొగడబడినమహానుభావుడు..'' వీళ్ళూ.. మా వాళ్ళు..'' అని తెలుగువాళ్ళు చెప్పుకొనవలసిన వాళ్ళలో ఎన్నాళ్ళ కైనా నిలిచిపోయే వాడు..ఆ మహానుభావుని గురించిఎవరు చెప్తే, ఎంత చెప్తే, ఏం చెప్తే సరి పోతుంది?..ఐనా మనసాగి చావదు కదా!...

            సాక్షాత్తూ కాశీ సంస్కృత విశ్వ విద్యాలయ ఆచార్యులచేత ' ఈ గమకం, సంస్కృతవృత్తాల శయ్య, గతి ఈ దేశంలోనే అపూర్వం! సంస్కృతాంధ్రాలు ఇంత అందంగాసహజీవనం చేస్తాయని మాకు తెలియదు, ..ఈ కవి రచనా రీతి విశిష్టమైనది..దీనిని ఆంధ్రరీతి అని కానీ..విశ్వనాధరీతి అని కానీ పిలుద్దాము..'' అనిపించినమహాకవి..కాదు..మహాకవి సామ్రాట్టు..విశ్వ నాధ సత్యనారాయణ వారు స్వయం కృషితో,పట్టుదలతో తనను ఒక్కొక్క భాషా సాహిత్యం గురించి ఎవరైనా ఎద్దేవా చేసినప్పుడల్లా..ఆ భాషా సాహిత్యాన్ని మథించి...లోతులు తుద ముట్టిన వారు, 10-09-1895 మన్మధ నామ సంవత్సరం లో నందమూరులో జన్మించారు, విద్యార్ధి దశ అంతా బందరు హిందూ హైస్కూల్ లో, నోబుల్ కాలేజీ లో గడిపారు. హిందూ హై స్కూలు ఆవరణంలోకానుగ చెట్లెక్కి అలవోకగా 'శృంగార వీధి' పద్యాలు చెప్పారట!

            నేషనల్ కాలేజి, హిందూ కాలేజి, ఏ సీ కాలేజి,విజయవాడ లో కళాశాలలో, కరీంనగర్ కళాశాలతొలి ప్రిన్సిపాల్ గా, సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసన మండలి సభ్యులుగాఎక్కడ వున్నా రచనా వ్యాసంగమే వారి ప్రధాన వ్యాసంగము! 1920 ప్రాంతంలో 'సాహితి' లోఅచ్చైన 'గిరికుమారుని ప్రేమ గీతాలు' వారి తొలి కవితలట. మొదటి నవల పేరు 'అంతరాత్మ'అట, జాతీయోద్యమ నేపధ్యంలో మొదలు పెట్టిన దీన్ని ఎందుకనో సగం వ్రాసి వదలి పెట్టారుట.

              ఆయన రచనా విధానం అత్యంత విచిత్రమైనది. పద్యాలయితే ఒకేసారి ఒక వంద తమమనసులోనే పూర్తి చేసుకొని, ఒకే సారి వాటిని కాగితం మీద పెట్టేవారట. ప్రయాణం లోనో,వేరే ఎక్కడనో ఉన్నప్పుడైతే ఒక్కొక్క పద్యానికి అంగవస్త్రానికి ఒక్కొక్క ముడి వేశే వారట.ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక్కొక్క ముడి విప్పుతూ ఒక్కొక్కటి స్ఫురణకు తెచ్చుకునేవారట. వచనం అయితే చెప్తుంటే వేరే ఎవరైనా లేఖకుడు వ్రాయాల్సిందే. ;ఏక వీర' వ్రాస్తున్నప్పుడుమాత్రం ప్రతి శుక్ర వారం టెంకాయ కొట్టి, పూజ చేసి..ఆశువుగా వినిపించే వారట. 'వేయి పడగలు'మాత్రం మొదట్లో స్వయంగా వ్రాయడం మొదలు పెడితే..మూడు ప్రకరణాలకు మూడు నెలలు పట్టిందట, ఇలా కాదని, చెప్పడం.. లేఖకుడు వ్రాయడం మొదలు పెట్టిన తర్వాత..29 రోజులలో వేయి పేజీలు ఏక బిగిన చెప్పారట!

        సుష్టుగా భోజనం చేసే భోజన ప్రియుడు, ఆవకాయలో పచ్చి మిరప కాయ కొరుక్కునే ఆశ్చర్యకరమైన అలవాటు, కామిక్స్ అన్నా..స్టంటు సినేమాలన్నా..ఇంగ్లీషు సినిమాలన్నావదిలిపెట్టని ప్రీతీ.. ఇవి కొన్ని వారి అభిరుచులు, అలవాట్లు! ఆయన పీఠికలు గొప్పవా.. ఆ పీఠికలు వున్న గ్రంధాలు గొప్పవా..అని అప్పుడప్పుడూఅనేకులకు సరసమైన సందేహం కలుగుతుంది! బ్రాహ్మీమయ మూర్తికి బొడ్డూడని బాలకుల బహు పరాకులు..శత సహస్ర నమోవాకాలు..

             ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. 
          ''ఒక జాతి జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రాణభూతిమ్మది ప్రాణశక్తి'' అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సంప్రదాయ భీష్ముడు. ఆయన మాట కరుకు, మనసు వెన్న, ఆయన మరెవరో కాదు తెలుగు సాహితీకారులకి జ్ఞాన పీఠాన్ని రుచి చూపిన కవిసామ్రాట్‌, కళాప్రపూర్ణ, పద్మభూషణ్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకే సురాకృతి సుకృతమైన ప్రతిభకు భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే సాహిత్యాన్ని ఒక మార్గంగా తీసుకుని వర్తమాన కాలంలో ఆర్షధర్మానికి ఏకైక ప్రతినిధిగా నిలిచారాయన. తన జీవితాన్ని, సాహిత్యాన్ని, భారతీయ వైభవ పునరుద్దానికై త్రికరణశుద్ధిగా అంకితం చేసిన రుషి వంటి కవి ఆయన. 
                 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును. 
                విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం. 
              1895 సెప్టెంబర్‌ '10'న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన విశ్వనాధ సత్యనారా యణ తల్లిదండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి, సంపన్న కుటుంబంలో పుట్టినా దారిద్య్ర వ్యధలనను భవించిన ఉదారుడాయన. సత్యనారాయణగారి వ్యక్తిత్వం విలక్షణమయింది. బహిరంగ ప్రసంగాల ద్వారా తన ఆశయాలనూ, ఆదర్శాలనూ దాపరికం లేకుండా ప్రతిపాదించినా అంతరంగంలో స్వచ్ఛత నిలుపుకొన్న మనిషి ఆయన. ఎందరిని ఎన్ని విధాలుగా ఎంతగా, తూలనాడినా, ఆత్మీయతా ప్రదర్శన తో అతిథి మర్యాదలతో కులమతాతీతమైన ఆర్థ్రహృదయంతో సమ్మోహనపరచిన కొద్ది మందిలో ఆయన ఒకరు. ఈ వైరుధ్యం ఆయన రచనల్లోనూ కనిపిస్తుంది. ఆయన వచన రచనలు, తద్విరుద్ధమైన ద్రాక్షాపాకంలో నడనిచాయి. పాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. 
                 ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన 'విశ్వనాధ' గారి 'వేయి పడగలు' మాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతహాసం 'వేయిపడగలు'. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ఆ కాలంలో విశ్వనాధ వాణి ఆంధ్ర పౌరుష(1917), ఆంధ్ర ప్రశస్తుల(1919) రూపంలో సాహితీ రంగ ప్రవేశం చేసింది. 
              తన తొలి రచనలతోనే శ్రీశ్రీ వంటి ప్రతిభావంతున్ని మంత్రముగ్థుణ్ణి చేసి అనుకర్తగా ఆరాధకుడుగా, తీర్చిదిద్దినవాడు విశ్వనాధ. ఆ తరువాత శతాధికరచనలు చేసిన కొద్ది మందిలోనూ ఆయనే అత్యంత ప్రశస్తి పొందినవాడు. శ్రీనాధుడు తరువాత పరిసర ప్రకృతిని అంతగా పరిశీలించి వర్ణించిన మరో కవి విశ్వనాథే. ఆయన భాషా జోత్యభిమానాలకు తెలుగు రుతువులే నిదర్శనం. ఆయన రచనల్లో ప్రజాభిమానం సంపాదించినవి' 'కిన్నెరసాని' పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఆంధ్రా ప్రశస్తులు, విశ్వనాథ సత్యనారాయణ అభిమా నించిన రచన మాత్రం శ్రీ మద్రామాయణ కల్పవృక్ష (1934-62)మనే మహారచన. ఆ రచనకు జ్ఞానపీఠ్‌ పురస్కారం లభించింది. ఏకవీర చలన చిత్ర మయింది. చెలియలికట్ట పేరు తెచ్చింది. వరలక్ష్మి శ్రీశతి అనే స్మృతికావ్యం గుండెలు కరిగిస్తుంది. చారిత్రక నవలగా బద్దెన్న సేనాని ప్రతిష్టతెచ్చింది. నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితాధోరణుల మీద ఆయన విమర్శ వ్యాసాలు ప్రశంసలు కురిపించాయి. ఆంధ్రసాహిత్య చరిత్రను, భారతావతరణము'వంటి పది రేడియో నాటికలుగా మలిచారు. అమృత శర్మిష్ఠమ్‌, గుప్తపాశుపతమ్‌, అనే నాటకాలను 'ఆశ నిరాసకు' అనే నాటికను, 'దేవీ త్రిశతి' శివసాహస్రకు, వంటి కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించాడు. సత్యనారాయణ గారి రచనలో ప్రతిదీ ఒక సంచలన రచనే అయింది. ఆ రచనలు వస్తురీత్యా, ప్రయో గరీత్యా, శిల్పరీత్యా, ప్రమాణాల రీత్యా సంచలనం కలిగించినవే. ఈ సంచలనంలో ఆయనను సాంప్రదాయకులూ, సాంప్రదేయే తరులూ విమర్శకుల రూపంతో సమంగానే ఎదుర్కొన్నారు. అడ్డగించటానికి ప్రయత్నించారు.
            అయినా ఈ అవరోధాలన్నింటినీ సమర్థంగా తొలగించుకొంటూ విశ్వనాధ తొలిసారిగా సాహిత్య సరస్వతి ప్రవహించింది. తెలుగు నవలా సాహిత్యంలో తొలిసారిగా నవలకు 'కావ్య' గౌరవం సంపాదించి పెట్టింది. 'ఏకవీర' వస్తువు,దీని నిర్వహణపరంగా నూత్న ద్వారాలు తెరిచింది. కిన్నెరసాని పాటలు తెలుగులోని మాధుర్యాన్ని వాగులు పారించింది. 
               ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా విశ్వనాథ సత్యనారాయణ మహాకవి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించనివారు కూడా ఆయన ప్రతిభని కొనియాడారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదీ ఆయన గొప్పదనం. అదీ ఆయన సాధించిన సర్వకాలీన సార్వత్రిక సాహితీ విజయం. ఆయన రామాయణ కల్ప వృక్షం అర్థం కాక పోతే కిన్నెసాని పాటలు ఆస్వాదించవచ్చు. ‘వేయి పడగలు’... అంత బృహత్‌ నవల చదివే తీరిక, ఓపిక, సమయం లేదనుకొంటే ‘చెలియలికట్ట’ లేదా ’ఏకవీర’ లేదా పులి ముగ్గు వంటివి చదవచ్చు. ఏ ప్రక్రియను అభిమానించే వారికి ఆ ప్రక్రియలో ఎన్నో రచనలు చేసిన జ్ఞానపీఠి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రచనలు ముద్రించే కుమరుడు విశ్వనాథ పావని శాస్త్రితో ఏమాత్రం సంబంధం లేకుండా ‘‘విశ్వనాథ సాహిత్య పీఠం’’ వెలిసింది. ఆ సంస్థ ప్రచురించిన ‘‘విశ్వనాథ వారి ముద్దు వడ్దన్లు’’లో ఏముందో చూద్దాం. 
                 ఆయన చేపట్టని ప్రక్రియా ప్రయోగమూ లేదన్నట్టుగానే, మానవ జీవితంలో ఆయన స్మృశించని సమస్య కూడా లేదేమోననిపిస్తుంది. ఆయన ప్రతి నవలా, ప్రతి కథా ఏదో ఒక సామాజిక సమస్యనో, మానసిక సమస్యనో, ఆధ్యాత్మిక సమస్యనో, సాహిత్య సమస్యనో, ఆర్థిక, రాజకీయ సమస్యనో...ప్రధానీకరిస్తుంది. విశ్వనాధ సత్యనారాయణ ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, ఆధునికాంధ్ర సాహిత్యంలో వారసత్వం, గురువు చూపిన పద్యరచనా సంప్రదాయం ఆయనలో స్థిరంగా నిల్చిపోయాయి. తరతరాలుగా అవిచ్ఛన్నంగా వున్న భారతీయ ధర్మం, మాత్రమే ఏక కాలానికి అయినా మానవజాతికందరికి ఆదర్శం. అనుసరణీయమని ఆయన అచంచల విశ్వాసం. భారతీయ ధర్మాన్ని, ప్రతిభాపాండిత్యాన్ని విజ్ఞాన విశేషాలన్నీ కవిత్వంలో రసమయంగా మలచి అందించిన మహాకవి విశ్వనాథ. దాదాపు అరవై నవలలు రాసి, ఆ నవలా సృష్టిలో భారతీయ ధర్మంతో పాటు, ఆధునిక భావాలను వ్యాఖ్యాన ప్రాయంగా కథ కల్పన చేసిన నవలా చతురాస్యుడు. సంస్కృతనాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష్ఠ, తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి, కావ్యతేదహరిశ్చంద్ర ప్రసిద్ధమైనవి. దాదాపు 150 గ్రంథాలకు పైగా రచన చేసిన ఏకైక తెలుగు కవి, విమర్శకుడు విశ్వనాథ. ఆయనకు 1958లో శాసన మండలి సభ్యత్వం వచ్చింది. 1971లో ఆస్థానకవి పదవి సంక్రమించింది. 1942లో కలకత్తాలో పుష్పకిరీటసన్మానం జరిగాయి. 'విశ్వనాధ' కొలవెన్నురామకోటేశ్వరరావుతో కలిసి ''త్రివేణి' అనే దైవమాసికాంగ్ల పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు. ....'జయంతి' అనే దైవమాసిక తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించారు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. 
                ఆయన మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఈ చిన్ని ఉదాహరనే చాలు...బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో  ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది. ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా ! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. ( పైనున్న ఆయన చిత్రం ఆ సందర్భంలోనిదే ఉండొచ్చు ) ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు. ” నీ పేరేమిటి ? ” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు…. ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. 
” ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? ” అనడిగాడు. 
” ఆయనతో నీకేం పని ” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. 
” పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ! ” అన్నాడా అబ్బాయి తాపీగా. 
అంతే… ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది. 
” వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో ! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది ” అని గయ్యిమన్నారు. దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే ! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి…” లేరా అబ్బాయ్ ! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా ! “…… అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు.
విశ్వనాథవారి మాటల చమత్కారం అదీ ! 

            రచయితగా ఆయన సుదీర్ఘ జీవితంలో ఎదురైన వ్యక్తులతో జరిపిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వం, సాహిత్యంపై ఇతరుల అభిప్రాయాలు, వివిధ సంఘటనలపై ప్రతి స్పందనలు ఆయన వివిధ అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ నాలుగు సంకలనాల్లో ఉన్నాయి. అటువంటివి కొన్ని చూద్దాం. 
* ‘‘మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు చప్పండి’’ అని శ్రీశ్రీని ఎవరో అడిగారట ఒక తూరి. దానికి వారు ‘‘ఒకటి- మహా ప్రస్థానం గీతాన్ని భారతి మాసపత్రిక తిరగ్గొట్టడం. రెండు- కవితా! ఓ కవితా అనే గీతం చదువుతూ ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశ్వసిక్త నేత్రులు కావడం’’ అని అన్నారట.’’ 
* ఈ జ్ఞానపీఠ బహుమతికి తగుదునా? తగనా? అన్న విచారణ ఉంది. ఇదివరకు వచ్చిన వాళ్లంతా తగితే నేను మాత్రం ఎందుకు తగకూడదు? అనే దురహంకారము లేకుండా ఉండేందుకు అంత చేవ చచ్చిలేను గదా. నాకు అవార్డు ద్వారా లభించిన లక్ష రూపాయలలో చాలా మొత్తాన్ని మా తండ్రిగారు అరవై యేండ్ల క్రితం నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు వినియోగిస్తాను. మిగతాది అనేక రంధ్రాలున్న నా జేబులో వేసుకొంటాను.
* లోకంలో మానవజాతి రెండు రకాలు. ఒక రకం సంసారులు, రెండవ రకం బిక్షగాళ్ళు. అధికారులనండి, సన్యాసులనండి, మత గురువులనండి, కవులనండి, గాయకులనండి వీళ్ళందరూ రెండవ రకం. వీళ్ళు బిచ్చగాండ్లు. వీళ్లకు సంసారాలు చట్టు బండలు అక్కరలేదు. వీళ్లకు కొట్టుకు తినడం ప్రధానం.* ‘‘పాలముంచినా నీట ముంచినా నువ్వే’’ నన్నాడు. నేనన్నాను కదా మాకు పాలూ నీళ్లూ రెండూ విడివిడిగా ఉండవు. కలిసే ఉంటాయి. ఇల్లు దూరమైన కొద్దీ నీళ్లుక్కువ కలుస్తవి.* ఓ మీటింగులో విశ్వనాథవారు ‘‘వేసవి కాలంలో కాలవలు ఎండిపోతాయి. కాబట్టి వాటిలో చెలమ గుంటలు త్రవ్వుతారు; తియ్యటి నీళ్ళు పడతాయి’’ అని అన్నారట. ‘‘ఒరే! మా ఊళ్లో కాలవల్లో చెలమ గుంటలు తవ్వితే నీళ్ళు పడవేమిటిరా?’’ అని అన్నారట చెళ్లపిళ్ళవారు విశ్వ్నాథతో. ‘‘ఎట్లా పడతాయి? ఆ నీళ్లన్ని మన కవిత్వంలోకి ఎక్కితే’’ అని అన్నారట విశ్వనాథవారు. ఇటువంటి సంభాషణలు కొల్లలుగా కనిపిస్తాయి.

కల్పవ్రుక్షాలయిన సాహితీ సంపదని మనకి వారసత్వం గా అందించి 1976 అక్టోబరు 18న న పరమపదించారు.

ఎందరో మహానుభావులు ....... అందరికీ వందనములు !!!!!!!!!

2 comments:

  1. బ్లాగ్ లో పంచుకున్నందుకు ధన్యవాదాలు. Thanks a lot.

    ReplyDelete