Thursday, August 23, 2012

ఘంటసాల వెంకటేశ్వర రావు




         తండ్రి: సూర్యనారాయణ తల్లి: రత్నమ్మ పుట్టిన తేది: 1922 డిసెంబర్ 4పుట్టిన ప్రదేశం:గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామముస్వర్గస్తులైన తేది: 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. తండ్రి సూర్యనారాయణ ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల తండ్రి గారు చివరి రోజుల్లో సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. 


            తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

             విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉన్నది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అనిచెప్పేవాడు.

              శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు. వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.




సినీ ప్రస్థానం:
               1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు. సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తనమకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు.భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది. తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.

విజయ విహారం:

               1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికిసాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావుచెపుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యంసినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.

చివరిదశ:

        1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.



వ్యక్తిత్వం: 

                ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు. "నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు. మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు. పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.

                                                     

  •                                      దారిలోన మజిలీ ఇట చేసిన గంధర్వుడు
                                        వున్నా లేకున్నా తను గుండె గుడుల దేవుడు
                                        షడ్రసాల రుచుల తెలుగు పాటల కది వంటశాల
                                        సరిగమలను స్వరఝరులను గొని పండిన పంటశాల
                                        తెలుగు చెవుల పంట ఖేల గళ లీల ఘంటసాల!
                                        దేవేంద్రుని కిపుడక్కడ ఘంటసాల గళ జోల!!!
  •                                             
                                         మల్లె తోటలలోన మనసైన గుసగుసలు
                                         బంగారి మావకై భామ విరహపు బుసలు
                                         అత్త కోడలి దుత్త మీగడల జగడాలు
                                         కొత్త కొత్తలు మనసు మాగాణి చిత్తడులు
                                         పండించు నివ్వరులు పాట పంటల సిరులు
                                         నిండించెనొక హలము ఘంటసాలది గళము!

  •                                              

                                          బహుదూరపు బాటసారి పాట తీపి ఖండసారి
                                          తెలుగు కోడలమ్మ సరోజమ్మ పాటలోని చెమ్మ
                                          పూల బాల బేల జాలి కథల వ్యధల కరుణ చిలుకు
                                          స్వచ్చమైన తెలుగు లోని ఉచ్చారణ తేనె చినుకు
                                          ఘంటసాల నీతోనే కనుమరుగయ్యింది నేడు
                                          ఒకరిద్దరు మినహా మిగిలింది మాకు హా.. తన్హా !!

  •                                                

                                            హంసధ్వని భూషిత హేరంబం తో ఆరంభం
                                            పల్లె పల్లె లో సినిమా హాళ్ళలోని సంరంభం
                                            దినకరా..శుభకరా..వినబడితే బిర బిరా
                                            సినిమాలకు వురికెళ్ళిన గురుతింకా పోదురా
                                            గుడిలోనూ నీ గొంతు బడిలోను అదే తంతు
                                            తెలుగు శ్వాస, రసపిపాస, నీ గొంతుక పై ధ్యాస!


  •                                                         

                                           కురుక్షేత్రమందు విందు గీతనందె నొక్క నరుడు
                                          ఈ నాడిటు ఇంటింటా గీతను విని ప్రతి నరుడు
                                          తానోడిన గెల్చిననూ నువు, గీత నిల్చునను
                                          గీతను వెలయించినదర్జును కోరకా నీ కొరకా?
                                          ఆ భాగ్యము నరునిదా?తెలుగు నెరుగు నరులదా?
                                          కృష్ణుడు,అర్జునుడు,గీత,ఘంటసాల పరులకా???

నాద బ్రహ్మ-శ్రీ త్యాగరాజ స్వామి

         



           ''ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు..' అనే పల్లవిని వినని, ఒక్కసారైనా సరదాగానైనా ఆ మాట అనని తెలుగువాడు వుండడు. శాస్త్రీయ సంగీత బాణీలోని ఒక కీర్తనలోని పల్లవిని జన బాహుళ్యం లోకి, ప్రజల హృదయాలలోకి ఒక సత్యాన్ని పలకడం ద్వారా తీసుకెళ్ళిన మహానుభావుడు నాదబ్రహ్మ గా కొనియాడబడిన త్యాగరాజస్వామి వారు!

           కర్ణాటక సంగీతంగా పిలువబడే దక్షిణ భారతదేశ శాస్త్రీయ సంగీత విధానానికి ఆద్యుడు పురందర దాసు అంటారు..కానీ త్యాగరాజస్వామి కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పితామహుడిగా గుర్తింపబడ్డారు.క్రీ.శ .04 -05 -1767 నాడు త్యాగరాజస్వామి వారు జన్మించారు, పురందర దాసు అంతకు 200 సంవత్సరాల క్రితం వారు.త్యాగరాజు,శ్యామ శాస్త్రి,ముత్తుస్వామి దీక్షితార్..ఈ ముగ్గురినీ కర్ణాటక సంగీత వాగ్గేయకార త్రయం అంటారు.వీరిలో త్యాగరాజస్వామి వారి పేరు పండిత పామరులకు అందరికీ తెలిసిన పేరు. త్యాగరాజస్వామి వారి పూర్వీకులు ఆంధ్రులే.కర్నూల్ జిల్లాలోని కాకర్ల గ్రామంనుండి తమిళనాడు లోని తంజావూరు దగ్గిరి తిరువారూరుకు వలస వెళ్ళారు, ఆయన ముత్తాత పంచనాద బ్రహ్మ గారి హయాములో.వారి కుమారుడు, త్యాగ రాజస్వామి వారి తాత ఐన గిరి రాజ బ్రహ్మ గొప్ప కవి, పండితుడు, తంజావూరు రాజాస్థానంలో సన్మానం పొందిన వారు. ఆయన కుమారుడు రామబ్రహ్మ, త్యాగరాజ స్వామి వారి తండ్రిగారు, గొప్ప పండితుడే కాక మహా రామ భక్తుడు, ఆయన ఇంట్లో నిత్యమూ రామ పంచాయతన పూజ చేసే వారు. ఆయన ధర్మ పత్ని, త్యాగరాజస్వామి వారి తల్లి సీతమ్మ కూడా రామభక్తురాలు. తంజావూరు రాజు తుల్జాజీ మహారాజు నిత్యమూ రామబ్రహ్మ గారిచేత రామాయణం వినిపించుకునే వారు. అటువంటి పరమ భక్తుల ఇంట పుట్టిన త్యాగరాజస్వామివారు శ్రీ రామ సాక్షాత్కారం పొందిన సాధకుడు.త్యాగరాజస్వామి వారికి ఇద్దరు అన్నలు.పంచనాద బ్రహ్మ,పంచాప కేశ బ్రహ్మ. పంచాపకేశ బ్రహ్మ యవ్వనంలోనే మరణించాడు.పెద్ద కుమారులు ఇద్దరూ చెడు అలవాట్లకు లోనై అపఖ్యాతి తెస్తే, ఆవేదనకు గురైన రామబ్రహ్మ తిరువారూరు లోని శివుడు త్యాగరాజ స్వామికి మొక్కుంటే పుట్టాడు కనుక మూడవ కుమారుడికి త్యాగరాజస్వామి అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి రామబ్రహ్మ సమీపంలోని తిరువాయూర్ కి వెళ్లి నివాసం ఏర్పరచుకున్నారు.

         ఐదు నదులు కావేరి,కొలరూన్,కోడమూరుతి,పెన్నార్,వేట్టార్..చట్టు ముట్టి ప్రవహిస్తున్న పుణ్యక్షేత్రం తిరువాయూర్.అక్కడి సంస్కృత పాఠశాలలోనూ, అక్కడి మహా విద్వాంసులు శోంఠి వేంకట రమణయ్య పంతుల వారి వద్ద సంగీత విద్యలోనూ అభ్యాసం చేశారు త్యాగరాజస్వామి వారు.ఆ రోజుల్లోనే రామక్రిష్ణానంద స్వామి అనే యోగి ఈయనకు రామతారకమును ఉపదేశించారు, ఆ తర్వాత నారదోవాస్తి అనే మంత్రం ఉపదేశించారు, స్వరార్ణవం అనే మహత్తర సంగీత కళా రహస్య నిధి ఐన పుస్తకాన్ని ఇచ్చారు. ఆయన నారద మహర్షి అవతారం అని త్యాగరాజ స్వామి వారి నమ్మకం. ఇంట్లో నిత్యమూ తల్లిదండ్రుల కు సహాయంగా రామసేవా కార్యక్రమం లో మగ్నులై సంగీత విద్వాంసురాలైన తల్లి అన్నమయ్య కీర్తనలను, భద్రాచల రామదాసు కీర్తనలను, క్షేత్రయ్య పదాలనూ పాడుతుంటే ఒకరోజు తను ఆశువుగా ''నమో నమో రాఘవాయ '' అనే కీర్తనను దేశి తోడి రాగం లో పాడి ఆనాటినుండి మొదలుకొని, 24000 కీర్తనలను రచించారని ప్రతీతి, కానీ ఇప్పుడు అన్నీ లభ్యములు కావు.తండ్రి మరణంతో,తల్లీ,తనూ, భార్యతో సామాన్య జీవనం కొనసాగిస్తున్న త్యాగరాజస్వామి వారు నిత్యం కావేరి తీరంలో శ్రీరామ షడక్షరీ మంత్ర జపం ఒక లక్షా ఇరవై ఐదు వేల సార్లు చేశే వారు, తర్వాత ఆ నది తీరంలో తన కీర్తనలు పాడుకుంటుంటే గ్రామ ప్రజలు వింటూ ఆనందించే వారు, ఇంట్లో నిత్య అర్చన, అనంతరం వాల్మీకి రామాయణం, పోతన భాగవత పారాయణం,పురందరదాసు కీర్తనలను పాడుకోవడం ఇవీ వారి దినచర్యలో భాగాలు.

              తంజావూర్ మహారాజు, మహారాజు స్వాతి తిరునాల్ వంటి రాజులూ, ఎందరో సంపన్నులు ఎన్ని రకాలుగా ఆహ్వానించినా ఏ నాడూ రాజాశ్రయం కొరకు యాచించని మహానుభావుడు. గణిత, జ్యోతిష, సంగీత విద్య విశారదుడు, మహా రామ భక్తుడు,సంప్రదాయం ప్రకారం నారద మహర్షి అవతారం, వాల్మీకి అవతారం త్యాగరాజస్వామి వారు. మొదటి భార్య పార్వతి కాలవశాత్తూ మరణించిన తర్వాత తన తల్లి బలవంతం మీద జీవిక కొనసాగించడానికి, గృహస్థ ధర్మాన్ని కొనసాగించడం కొరకు తన భార్య చెల్లెలు కమలమ్మను వివాహం చేసుకొని, ఒక కుమార్తెను కని, అమెకి 'సీతా మహాలక్ష్మి' అని పేరు పెట్టుకున్నారు!నిత్యం వీధులలో తన గాన రసప్రవాహం పారిస్తూ, యాచక వృత్తిలో వచ్చిన దానిలో తన కుటుంబాన్ని వెళ్ళదీసి , శిష్యులకూ భోజనం పెట్టి సంగీతం నేర్పారు!

          ఎందరు రాజులూ, చక్రవర్తులు ఆహ్వానించినా ఏ నాడూ గ్రామం దాటి వెళ్ళక, కంచి కామకోటి పీఠం ఆచార్యులవారు తాము కదలలేని స్థితిలో ఈయనను చూడాలనుకుంటున్నారు అని తెలిసి కంచి వెళ్లి దారి పొడవునా ఎందరో శిష్యుల, ప్రశిష్యుల అతిధిగా తమిళనాట తమ సంగీత గంగను పొంగించి, కంచిలో కొన్ని రోజుల బస తర్వాత తిరిగి వస్తూ తిరువక్తియూరు లో వీణా కుప్పయ్యర్ అనే ఒక శిష్యుని ఇంట బస చేసి, ఆ వూరి సంపన్నుడు ఒకడు ఈయన మీద భక్తితో కానుకలు ఇస్తే, ఆ శిష్యుడు ఈయనకు తెలియకుండా ఇతర శిష్యులకు బంగరునాణాల సంచిని ఇస్తే వారు పల్లకీలో దాచారు. తిరుగు మార్గంలో అడవిగుండా పల్లకీ వెళ్తున్నప్పుడు బందిపోట్లు దోచుకోవడానికి వస్తే మనదగ్గిర ఏముంది కనుక భయం అన్నారు త్యాగరాజస్వామి వారు.శిష్యులు అప్పుడు బంగరు నాణాల సంగతి చెప్పి, రామ సేవలో లోటు రాకుండా వుండడం కోసమని ఇస్తే తీసుకున్నామని చెప్పారు.అయితే రాముని సొమ్మును రాముడే కాపాడుకుంటాడు అని..ఇరుప్రక్కల తోడై రారా..అని కీర్తన పాడుకుంటుంటే రామలక్ష్మణులు ధనుర్ధారులై ఆ దొంగలను భయపెట్టి పారద్రోలారు. మర్నాడు వీరు బస చేసిన దగ్గిరకు ఆ దొంగలు వచ్చి క్రితం రాత్రి తాము చూసిన ఇద్దరు భటులను, వారి అంద చందాలను, వారి చేతులలోని విల్లంబులను, వారి లాఘవాన్ని పొగడుతుంటే, వారికి నమస్కరించి మీరే అదృష్టవంతులు..రామలక్ష్మణులను కళ్ళారా చూశారు అని ఆనంద బాష్పాలు రాల్చారు త్యాగయ్య. దారిలో తిరుపతిలో దర్శనానికి సమయం అయిపోయిందని అర్చకులు తెర వేస్తే, ''తెర తీయగరాదా..తిరుపతి వేంకట రమణ మత్సరమను తెర తీయగ రాదా'' అని కీర్తనను ఆలపిస్తే తెర దానంతట అదే తొలిగిపోయి స్వామి దర్శనం లభించింది త్యాగరాజ స్వామి వారికి. ఇలాంటివే ఎన్నో మహిమలను దర్శింప జేస్తూ ఇంటికి తిరిగివచ్చారు.ఇదొక్కటే ఆయన చేసిన యాత్ర గ్రామాన్ని విడిచి.

             ఈయన అన్న రాజుల ప్రాపకాన్ని వద్దంటున్నాడు అనే కోపంతో ఈయన పూజించుకునే రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్న, సీత, హనుమాన్ విగ్రహాలను కావేరిలో వేస్తే కావేరి వొడ్డునే శోకిస్తూ ప్రార్ధిస్తే, విగ్రహాలు వాటంతట అవే పైకి తేలాయి. ఆనందంతో ఉప్పొంగుతూ ''కనుగొంటిని శ్రీ రాముని నేడు'','';రారా మా యింటి దాక''..అని కీర్తనలను పాడుతూ మేళ తాళాలతో విగ్రహాలను ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి మరలా పూజలు ప్రారంభించారు.. ఈయన అన్నగారికి తమ తప్పుతెలిసి వచ్చి ఆయన కూడా శ్రీ రామ భక్తులైనారు. ఈయనకు కుమారులు లేనందున అన్నగారైన జప్యేషుని కుమారులే ఈయన స్మారక చిహ్నమైన సమాధి వద్ద పూజలు చేస్తున్నారు.. వారి సంతతి వారే ఇప్పటికీ ఆ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు.

       రెండవ భార్య కమలమ్మ మరణించిన తర్వాత, తీవ్ర వైరాగ్యానికి బాధకు గురి అయి,తము కూడా వెళ్లి పోవలసిన
సమయం వచ్చిందని తెలిసికొని, పుష్య శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రాత్రి పూజ,సంగీత సాధన, భోజనాలు
ఐన తర్వాత, శిష్యులకూ, అందరికీ, పుష్య బహుళ పంచమి నాడు తన ఇంటికి రమ్మని చెప్పి ..పుష్య బహుళ పంచమి నాడు 06 -01 -1847 నాడు పూజ, అర్చన, సంగీత సాధన ఐన తర్వాత , ఆపత్ సన్యాసం స్వీకరించి, శ్రీ రామనామజపం చేస్తూ సమాధిలోకి వెళ్లి, తమ ప్రాణాలను త్యజించారు. అందరి సమక్షంలో ఆయన కపాలం విచ్చుకొని, ఒక దివ్య జ్యోతి శ్రీ రామునిలో కలిసిపోయింది. తిరువయూరులో, అక్కడే ఆయనకు 'బృందావనం', సమాధి నిర్మించారు, ఈ నాడు తమిళనాడు లో ఆది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం.ఈ నాడు ఆయన జయంతి..ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు అన్న మహానుభావుని జయంతి ఉత్సవాల రోజుననే యాదృచ్చికంగా 'మన మహనీయులు' గ్రూప్ ప్రారంభింపబడి..ఆయనను గురించిన ఈ పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.

           త్యాగరాజస్వామి వారి కీర్తనలు బహు వేదాంత రహస్యాల సారాలు. ప్రపంచం మొత్తం శ్రీ రామ తత్త్వంతో నిండి వుందని భావించి సర్వత్రా శ్రీ రాముడినే దర్శించిన కారణ జన్ముడు..ఎక్కువగా తెలుగులోనూ,కొన్ని సంస్కృతం లోనూ కీర్తనలను రచించిన సంగీత శాస్త్ర రహస్య కళానిధి ఐన, నారద మహర్షి అవతారం ఐన శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనలను సంప్రదాయం ప్రకారమే, ఆయన నిర్దేశించిన రాగ,తాళ పద్ధతులలోనే సభ్యతగా, సంస్కార బద్దంగా ఆలపించడం, అలాగే ఆదరించడం మన కనీస కర్తవ్యం. దురదృష్ట వశాత్తూ తెలుగు సినిమాలలో, ఇతరత్రా ఆయన కీర్తనలను అక్కడక్కడా దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. దీనిని నిరసించాల్సిన అవసరం ఉన్నది.'

Source: Manamahaneeyulu-Facebook : https://www.facebook.com/groups/164573576982747/ 

Sunday, February 26, 2012

వీర సావర్కార్


         

   వీర సావర్కార్ 
 (28-05-1883...26-02-1966)

            1910 సం జులై 10 వ తేది, సూర్యోదయం అవుతున్న సమయం. ఫ్రాన్స్ లో మార్సేల్స్ రేవుపట్నం లో మొరియో అనే ఓడ లంగరు వేసుకొని నిలబడి ఉంది. దానిలో ఏదో యాంత్రిక లోపం ఏర్పడింది. ఓడ సిబ్భంది ఆ లోపాన్ని సరిదిద్దే హడావిడిలో ఉన్నారు. సముద్రం ప్రశాంతంగా ఉంది, ప్రయాణికులు ప్రశాంతంగా ఉన్నారు, అయితే ఈ వాతావరణం లో ఇమడకుండా ఒక యువకుడు ఏవేవో లెక్కలు వేసుకుంటున్నాడు. నిశ్చింతగా ఉండటం అతనికి సాధ్యం కాదు ఎందుకంటే అతడు బందీగా ఉన్నాడు అది కూడా ఆంగ్ల ప్రభుత్వానికి... అతడి పైన రాజద్రోహం నేరం మోపబడి ఉంది. అతని కదలికలను అనుక్షణం కనిపెడుతూ ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు కూడా. 'నేను బయటకు వెళ్ళాలి' అన్నాడు బందీ, ఒక పొలిసు అతనిని మరుగుదొడ్డి దగ్గరకు తీసుకు వెళ్ళాడు. బందీ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు, బయట ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు, మరుగుదొడ్డి గుమ్మానికి పైన అద్దాల కిటికీ ద్వారా లోపల ఉన్న బందీ కదలికలు పసిగట్టచ్చు. లోపలకు వెళ్ళిన బందీ తన కోటు విప్పి అద్దానికి అడ్డంగా తగిలిచ్చాడు. మరుక్షణం ఉహించలేని విధంగా మరుగుదొడ్డి రంధ్రం నుండి సముద్రం లో కి జారిపోయాడు. కెరటాలతో పోరాటం చేస్తూ ఒడ్డుకు ఈదుకుంటూ పారి పోయాడు. "పారి పోతున్న బందీ పేరు సావర్కర్".

        1883 వ సం మే 28 న మాహారాష్ట్ర లోని నాసిక్ లో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు వినాయక దామోదర్ సావర్కర్ జన్మించాడు. అప్పటికే వారికి గణేష్ దామోదర్ సావర్కర్ అని అబ్బాయి ఉన్నాడు. సమాన అర్ధం వచ్చే పేర్లు గల ఈ అన్నదమ్ములిద్దరూ దేశ కార్యాలలో కూడా సమానంగా పాల్గొని తమకు సమాన పేర్లు పెట్టడానికి సార్ధకత కల్పించారు. 

           "మిత్ర మేళ" అనే సంస్థ ను స్థాపించి దానిద్వారా వ్యాయామశాల, గణేష్ పూజ, శివాజీ జయంతి లాంటి సార్వజనిక ఉత్సవాలు నిర్వహిస్తూ అందరిని చైతన్యవంతుల్ని చేస్తూ చిన్నతనంనుంచే స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటమే సరైన మార్గమని తలచిన సావర్కర్ "అభినవ భారత్" అనే సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాడు. లండన్ లో న్యాయ శాస్త్రం చదివిన సావర్కర్ అక్కడ చదువుతున్న సమయంలో కూడా "ఇండియా హౌస్" అనే సంస్థ ద్వారా స్వాతంత్ర్య కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లండన్ నుంచే 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి పుస్తకం వ్రాసిన సావర్కర్ ఆ పుస్తకాన్ని ఇండియా లోని తన అన్నకి పంపించాడు. అయితే ఆ విషయం తెలిసిన ఆంగ్ల ప్రభుత్వం గణేష్ సావర్కర్ ను బంధించి జీవిత ఖైదు విధించింది. మదన్లాల్ ధింగ్ర లాంటి సావర్కర్ స్నేహితులు పోరాటం లో మరణించారు. అయితే ఇక లండన్ లో ఉండటం ఇష్టం లేక తిరిగి భారత్ వచ్చే ప్రయత్నం లో సావర్కర్ ఆంగ్లేయులకు దొరికిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ కి మునుపెన్నడూ లేని రీతిలో 2 రెట్లు జీవిత ఖైదు శిక్ష గ విధించింది. ఒక జీవిత ఖైదు అంటేనే 25 సం ల కటిన కారాగారం, అలాంటిది 50 సం లు శిక్ష విధించినది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే 1922 లో సావర్కర్ ని విడుదల చేసి గృహనిర్భందం చేసింది. 13 సం లు గృహనిర్భందం లో మ్రగ్గిన సావర్కర్ ఆ తర్వాత కూడా ఎన్నో శిక్షలకు గురయ్యాడు . 1948 లో గాంధీ హత్య కేసు లో విచారణకు గురి అయిన సావర్కర్ నిరపరధిగా నిరుపించాబడ్డాడు. 

         1964 సం లో భారత ప్రభుత్వం సావర్కర్ కు "అప్రతిహతీ స్వతంత్ర్యవీర" అనే బిరుదును ప్రదానం చేసింది. భారత్ పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సావర్కార్ 1966 సం ఫిబ్రవరి 26 న మృతిచెందారు.

           అంతవరకూ కేవలం సిపాయీల తిరుగుబాటుగా పిలువబడిన 1857 లో జరిగిన సైనికుల పోరాటాన్ని ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని పిలిచింది సావర్కరే!! '1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామము' అనే తన గ్రంధం లో (1907)ఈ చరిత్ర ను వ్రాశారు. ఇటలీ దేశానికి చెందిన మహా దేశ భక్తుడు మాజినీ జీవిత చరిత్రను 1906 లో వ్రాశారు! బాల్యంనుండే అనేక కవితలు గేయాలు దేశ భక్తిని పెంపొందించడానికి వ్రాశారు! అండమాన్ జైలులో హిందూ ముస్లిం ఖైదీలను ఏకం చేశారు. అంటరాని తనాన్ని నిర్మూలించడానికి సహపంక్తి భోజనాలను ప్రారంభించారు. అండమాన్ జైలు గోడల ను కాగితాలుగా చేసుకొని ఎన్నో గేయాలను, పద్యాలను, 'కమల గోమంతక్', 'మహా సాగర్' అనే కావ్యాలను రచించారు. అంటరానితనాన్ని నిరసించి నిమ్న వర్గాల వారిని దేవాలయలలోకి రానివ్వని దురాచారాన్ని ఖండించి , పూణే సమీపంలో 'రత్నగిరి' లో విఠలుని మందిరం నిర్మించి, దానికి పతిత పావన మందిరం అని పేరు బెట్టి, శంకరాచార్యులచే ఆ దేవాలయాన్ని ప్రారంభింప జేశారు. అండమాన్ జైలులో వారిని ఉంచిన గదిని జాతీయ స్మారక చిహ్నంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 'కాలా పానీ' అనే హిందీ/తమిళ సినిమాలో ఈ అండమాన్ జైలు గురించే చూపించారు! చివరి రోజులలో కూడా 'భారత దేశ చరిత్రలో ఆరు స్వర్ణ పుటలు' అనే గ్రంధాన్ని రచించారు. కుల, మత, వర్ణ విచక్షణ లేని అఖండ భారతాన్ని గురించి కలలు కన్నారు. భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించి, ఎంతో విచారించారు విభజనకు! ఏ దేవుడినీ, దేవతలనూ ఆరాధించ వలసిన అవసరం వున్నా, లేకున్నా, దేశమాతనే దేవతగా ఆరాధించాలని ప్రబోధించారు! గాయత్రీ మంత్రం బదులుగా..నిత్యమూ స్వతంత్ర భారతీ భగవతి ని ఆరాధించే వారు! '' జయోస్తు తే శ్రీ మహన్మంగళే శివాస్పదే శుభదే..స్వతంత్ర తే భగవతి! త్వామహం యశో యుతాం వందే!'' అనేదే ఆ గాయత్రీ మంత్రం! ఎనభై ఆరు సంవత్సరాల పూర్ణ జీవితం అనుభవించి, అపర భీష్మాచార్యుల వారి వలె..ఆహార పానీయాలను తగ్గించి..ఆహారం పూర్తిగా చివరిలో మానేసి..స్వచ్చంద మరణాన్ని పొందారు!

Thursday, February 23, 2012

వీరేశలింగం పంతులు


వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. 
వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.చదువుకునే రోజుల్లో కేశవచంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు. 1867 లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష రాసి న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.
ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణా భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరులో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.
కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులుతో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.
                 వీరేశలింగం హేతువాది .ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. సంఘసంస్కరణ కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లల్ను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.
బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలన కు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధని లో వ్యాసాలు రాసాడు.ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడి కి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ (పెళ్ళయ్యాక బాపమ్మ కు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు.
              సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.ఆయన 130కి పైగా గ్రంధాలు రాసాడు. ఆన్ని గ్రంధాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించాడు.

Wednesday, February 22, 2012

సుభాష్ చంద్రబోస్

 ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించిన సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో వోటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో తన ప్రాణాలను బలిదానం చేసిన మహానుభావుడు.
ముగ్గురు అన్నల తర్వాతి వాడు కనుక గారాబంగా పెరిగినా, బాల్యం నుండి క్రమశిక్షణ,దేశ భక్తి, దైవ భక్తి సాటి మానవులకు సేవ జేయాలనే తపన ఆయనలో ఉండేవి. ఒక్కసారి చదివితే చాలు దేన్నైనా మర్చిపోయే వాడు కాదు. అన్యాయం జరుగుతున్నది అనిపిస్తే ఎవరికైనా ఎదురు తిరగడమే బాల్యంనుండి ఆయనకు అలవాటు.
బాల్యంలో ప్రోటేస్తేంట్ యురోపియన్ స్కూల్ లో భారతీయ విద్యార్ధులను చులకన జేసి ఇబ్బందిపెడుతుంటే రెండుసార్లు విద్యార్ధులను కూడా దీసి ఆంగ్లేయ విద్యార్ధులను చితక బాదడంతో మొదలైకలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు అన్యాయంగా నిందించిన ప్రొఫెసర్ని నిలదీసి, కళాశాల బందు చేయించి, విద్యార్ధులను కూడగట్టి చివరికి కళాశాల నుండి వెలివేయ బడేదాకా,ఆ తర్వాత స్వతంత్ర సమర రంగంలో ప్రవేశించిన తర్వాత ఎవరినైనా సరే నిర్మొహమాటంగా నిలదీయటం వలన ఎందరు ఆయనను వ్యతిరేకించినా నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, ఎవరికీ అడుగులకు మడుగులు వత్తని స్వంతంత్ర వ్యక్తిత్వం, ఆయన మీద జాతీయ స్థాయి వాళ్ళు అనిపించుకున్న వాళ్ళకు కూడా ఈర్ష్య ను కలిగించాయి! ఐనా ఎవరికీ ఆయన ఎన్నడూ భయపడలేదు, గులాంగిరి చేయలేదు! సింహం లాగా బ్రతికి యుద్ధరంగంలో సింహం లాగానే మరణించాడు.
పండగకు కొత్త బట్టలు, మిఠాయి, వద్దు అని అందుకు బదులుగా..ఆంగ్లేయులను ఎదిరించినందుకు నడి వీధిలో కొరడా దెబ్బల శిక్షను అనుభవిస్తున్న సుశీల్ కుమార్ అనే అతడిని చూపించమని తన మేన మామనుపట్టుబట్టి అక్కడికి వెళ్లి..ఆ సుషీల్ కుమార్ను కొడుతున్నప్పుడల్లా ఆవేశంతో తను వుగిపోతుంటే మేన మామకు భయం వేసి అక్కడినుండి తీసుకొచ్చాడు! తన నోట్ పుస్తకాలలో దేశ భక్తుల, విప్లవ విరుల ఫోటోలు అతికించుకునివరిగురించే మననం చేస్తుంటే ఆ నోట్ పుస్తకం చూసినఅతని తండ్రి స్నేహితుడు భవిష్యత్తులో వీడు ఆంగ్లేయులకుకొరకరాని కొయ్య అవుతాడు అన్నాడుట!
ఉత్తర ప్రత్యుత్తరాలంటే సుభాష్ చంద్ర బోస్ కి చాలా అభిరుచి వుండేది. అతని ఉత్తరాలు ఎంతో లోతైన, సునిశితమైన వేదాంత భావాలతో, సూక్తులన్ వంటి వ్యాఖ్యానాలతో ఉండేవి, అతని వుత్తరాలకోసం ఇంటిల్లిపాది ఎదురు జూసే వారు. వేణీ మాధవ్ అనే ఉపాధ్యాయుడు ఈయనను చాలా ప్రభావితుడిని చేశాడు. శారీరక, మానసిక ఆరోగ్యం ఈ రెండూ సమన పాళ్ళలో వుండాలని భావించేవాడు. ధ్యానం, ప్రకృతి వొడిలో వొంటరిగా గడపడం, వివేకానంద బోధనలనుపఠించడం, చరిత్ర ను చదవడం ఆయనకు అభిరుచులుగా ఉండేవి. తను కాలేజికి నడచి వెళ్లి..డబ్బులు మిగిల్చి వృద్ధులైన బిచ్చగాళ్ళకు దానం చేసే వాడట! కలకత్తా లో నావ వివేకానంద సమూహం అనే సంస్థ లో సభ్యుడైసామాజిక, ఆధ్యాత్మిక సేవ జేసేవాడు. ఎవరికీ చెప్పకుండా ఒక మిత్రుడిని వెంట తీసుకుని హరిద్వార్, హృషికేష్వారణాసి మొదలైన ప్రదేశాలన్నీ ఒక గురువు కావాలని అన్వేషిస్తూ కొన్నాళ్ళు తిరిగి ఎక్కడ చూసినా, ఉపన్యాసాలు, పూజలు, యజ్ఞ గుండాలు చూసి విసుగొచ్చి వెనక్కోచ్చాడు.
కటక్ లో ఉన్నప్పుడే ఇంటర్ చదువుతున్నప్పుడు 'స్వేచ్చా సేవ సంఘ్' అనే ఒక సంస్థను ఏర్పాటు జేసి, యువకులనుకూడ దీసి సమాజ సేవ, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం, ధ్యానం, క్రీడలు, వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతను కుర్చుని చదువుతున్నట్లు ఎవరూ ఎన్నడూ చూడలేదు..మెట్రిక్యులేషన్,ఇంటర్, తర్వాత బి.యే...అన్నింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఐ.సి.ఎస్. లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందాడు. ఆ తర్వాత భారత్ తిరిగి వచ్చిన తర్వాత గాంధీని కలిశాడు. కొంతకాలం కలకత్తా నేషనల్ కాలేజికి ప్రిన్సిపాల్ గా పని జేశాడు. చిత్తరంజన్ దాస్ స్థాపించిన స్వయం సేవక దళంలో కార్యకర్తగా వున్నాడు. 'బంగ్లార్ కధ' 'ఫార్వార్డ్' అనే పత్రికలకు సంపాదకుడిగా పనిజేశాడు. విప్లవ మార్గంలో పోరాటం చేస్తున్న 'యుగాంతర్' 'అనుశీలన్' అనే సంస్థలకు అభిప్రాయ భేదాలు వస్తే సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశాజ్ వచ్చినప్పుడు నిరసన చేసినందుకు ఆర్నెల్లు జైలు శిక్ష విధిస్తే న్యాయ మూర్తితోకోడి ని దొంగిలిస్తేనే ఆర్నెల్లు శిక్ష వేస్తారు..ఇదేనా ప్రిన్సు ఆఫ్ వాలెస్ కి వున్న విలువ? అని ప్రశ్నించాడుట!కలకత్తా కార్పోరేషన్ లో అధికారిగా వున్తూన్నప్పుడు ఒక ఆంగ్లేయుడు సిగరెట్ తాగుతూ ఆఫీసులోకొస్తేచెడా మడా వాయించి క్షమాపణ చెప్పించాడు..ఆ క్స్క్షతో..ఇంకొన్ని కారణాలతో ఆయనను ఖైదు చేసి, అక్కడక్కడాజిల్లాలో వుంచి చివరికి మండలే జైలుకు పంపారు! అక్కడినుండే జైలులోనుండే కలకత్తా శాసన సభకు ఎన్నికయ్యాడు.ఆయన ఆరోగ్యం జైలులో విషమిస్తే, పైపెచ్చు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే తప్పనిసరి..కొన్ని ఆంక్షలు విధించి ఆయననుప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్స్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్స్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడే దేశమంతా పర్యటిస్తూ ఆయన చేసే ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరితులయ్యారు..దీనితో ఆయనకు పెరుగుతున్న ఆదరణకు అసూయా పరులూ పెరిగారు!
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా మళ్ళీ ఆయన్ను అర్రెస్ట్ జేసి అక్కడక్కడా జైళ్లలో తిప్పి..చివరికి మళ్ళీ దేశ బహిష్కర శిక్ష వేసింది..ఆయన ఆరోగ్యం క్షీణిస్తే ప్రజలు చందాలు వేసి మరీ వియన్నా పంపారు.చికిత్స మరియు విశ్రాంతి కోసం..అప్పుడే యూరప్పర్యటించాడు..ముస్సోలినీ..హిట్లర్..రోమరోల..మొదలైన మహామహులను కలిశాడు..ఆ రోజుల్లోనే..1933 లో ఇండియన్ స్ట్రగుల్అనే పుస్తకాన్ని వ్రాశాడు. తండ్రి మరణం తో భారత దేశానికి వచ్చి మళ్ళీ యూరప్ వెళ్ళాడు. వియన్నాలో చికిత్స తీసుకున్నాడు. ౧౯౩౬ లొ నెహ్రూ అధ్యక్షతన లక్నో లో జరిగే కాంగ్రెస్స్ సమావేశాలకు భారత దేశంలో దిగగానే ఆయనను అర్రెస్ట్ జేసి ఎరవాడ జైలుకు పంపారు. పిత్తా శయంలో లోపం వల్ల గొంతు బొంగురు పోయింది. 1937లో ఆయనను విడుదల చేశారు. అఖిల భారతకాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు. దేశమంతా పర్యటిస్తూ ప్రజలను తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఉర్రూతలూగించాడు.ఈ దశలో ఆయన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యాడు!. సహజంగానే ఆది ఆయనపట్ల అసూయాపరులను పెంచింది. రెండవ సరి మళ్ళీ పోటీజేసి పట్టాభి సీతారామయ్య మీద గెలిచి కాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు..అప్పుడు తీవ్ర అనారోగ్యంతోకనీసం తన గెలుపు కోసం యే మాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ఆయన..అధ్యక్షా ఉపన్యాసం కూడా ఆయన వ్రాసి ఇస్తే ఆయనసోదరుడు చదివి వినిపించాడు. ఆ తర్వాత ఆయన వెనుక ఎన్నో కుట్రలు ప్రయత్నాలు జరిగి 1939 లో ఆయనను కాంగ్రెస్స్ నుండి బహిష్కరించారు!
లొంగడం, పోరాటం ఆపడం, ఒకరి కాళ్ళు పట్టుకోడం తెలియని వాడు కనుక వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని పెట్టాడు.వారపత్రికను కూడా వెలువరించడం మొదలు పెట్టాడు. మరలా దేశమంతటా పర్యటించాడు..మద్రాసు మొదలుకొని ప్రతి చోటా ప్రతిసమావేశానికీ లక్షలాదిమంది ప్రజలు ఆయన ఉపన్యాసాలకు వచ్చే వారు! అంబేద్కర్, సావర్కర్, హెడ్గెవార్ మొదలైన వారందరినీ కలిశాడు.. అందరూ ఆయనలో ఒక గొప్ప నాయకుడిని, అకళంక దేశ భక్తుడినీ చూశారు..1940 లో మరలా ఆయననుఅర్రెస్ట్ చేసి, తప్పనిసరి ఐ విడుదల చేసి, గృహ నిర్బంధం లో ఉంచితే..పథకం ప్రకారం 17 -01 -1941 న మహమ్మద్ జియా ఉల్ హక్అనే దొంగ పేరుతో పాస్ పోర్ట్ సంపాదించి తప్పించుకుని..తన వ్యక్తి గత సేవకుడు భగత్ రామ్ కు రహమత్ ఖాన్ అని పేరు పెట్టి.. అతనితో కలిసి..Kaka మెయిల్ లో ఢిల్లీ..పెషావర్..కాబుల్ దాటి భారత సరి హద్దులను దాటి నప్పుడు కళ్ళ నీళ్ళతో..వందే మాతరంనినాదం చేస్తూ..సాష్టాంగ దండ ప్రణామం చేసి..భారత దేశ ధూళిని నుదుట పెట్టుకున్నాడుట! కాబూల్ లో ఉత్తం చంద్ మల్హోత్రా అనే వ్యాపారి ఆయనకు బస, ధనం, ఇతర సహకారాలు ఇచ్చాడు. రష్యా,జర్మని, ఇటాలి దేశ రాయబారులతో మంతనాలుచేశాడు. 1941 మార్చ్ 18 న అక్కడి నుండి ఒర్లాండ్ అనే మారు పేరుతొ సమర్ఖండ్, మాస్కో ల మీదుగా బెర్లిన్ చేరుకున్నాడుజపాన్, ఇటలి, జెర్మని లకు చెందిన సైన్యాధికారులను కలుసుకున్నాడు..వారందరూ ఈయనను ఎన్నో రకాలుగా పరిశీలించినతర్వాత ఈయనను స్వతంత్ర భారత రాయబారిగా గుర్తించారు! బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన జరిగింది..26 -01 -1942 న పులి బొమ్మ కలిగిన జండా ఎగరేసి..బోస్ వేలాది మంది సైనికులను ఉద్దేశించి ప్రసంగించాడు..వారందరూ రక్త శపథం చేశారుప్రాణాలున్నంత వరకూ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడతామని. రోం లో, జపాన్ లో కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ శాఖలు ఇతర స్వతంత్ర వీరుల నేతృత్వం లో ఏర్పడ్డాయి. 27 -02 -1941 నాడు ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుతమైన ప్రసంగం చేసి యావత్భారతాన్నీ ఆవేశం లో ముంచెత్తాడు.
ప్రపంచ యుద్ధం తీవ్రమై..ఆంగ్లేయులు వరుసగా వోటమి పాలు అవుతూ..ఒక్కొక్క దేశాన్నే ఒక్కొక్క నగరాన్నే వదిలి పెట్టడం మొదలు పెట్టారు.జపాన్ వరుస విజయాలను నమోదు చేస్తున్నది..జపాన్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు..రాస్ బిహారీ బోస్ మొదలైన వారు ఆహ్వానిస్తే 45 రోజులు ఒక జలాంతర్గామిలో ప్రయాణించి జపాన్ చేరుకొని అక్కడ తన పేరు 'మత్సుడ' అని మార్చుకున్నాడు.. టోక్యో..సింగపూర్..రంగూన్ లలో సమ్మోహితులను జేశే స్ఫూర్తి దాయకమైన ఆయన ఉపన్యాసాలకుఆజాద్ హింద్ ఫౌజ్ లో తండోపతండాలుగా సైనికులు చేరారు..మహిళలకోసం ప్రత్యకమైన విభాగాన్ని ఏర్పాటు చేయ వలసి వచ్చింది...రంగూన్ లో ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి..మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు పెట్టారు.
చలో ఢిల్లీ నినాదం ఇచ్చి..ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి..జపాన్ సహకారం ఖాయం ఐన తర్వాత..ఇంఫాల్, అండమాన్, నికోబార్ లను జయించి అక్కడ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసి ముందుకు సాగుతుండగా..అంతవరకూ సహకరించిన విధి ప్రక్కకు తొలిగి పోయింది..కష్టాలు చుట్టూ ముట్టడం మొదలు పెట్టాయి..ముస్సోలినీ, హిట్లర్ ల చరిత్ర సమాప్తం ఐంది..జపాన్ దేశం యుద్ధంలో వోటమి చవిచూడడం మొదలు పెట్టింది..బర్మాలో తీవ్రమైన వరదల మూలంగా సైనికులు అనారోగ్యం, మృత్యువులకు గురి అయినారు..ముందుకు, వెనక్కూ పోలేని పరిస్థితి వచ్చింది..జపాన్ సైన్యాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి సమన్వయ లోపం వచ్చింది..రష్యా జపాన్ మీద దాడి చేసింది..జపాన్ మీద అణు బాంబ్ పడ్డది..జపాన్ అతలాకుతలమై లొంగిపోయింది..సుభాష్ చంద్ర బోస్ నిస్సహాయుడైనాడు..సహచరుల మొండి పట్టుదల బలవంతం మేరకు సుభాష్ చంద్ర బోస్ సురక్షిత స్థలానికి వెళ్ళడం కోసం, అజ్ఞాతం లోకి వెళ్ళడం కోసం మంచురియా వెళ్ళడానికి అయిష్టంగానేబయలు దేరాడు.జపాన్ లో విమానం ఎక్కి తైపే దాక ప్రయాణించిన తర్వాత విమానం లో సాంకేతిక ఇబ్బంది ఏదో వచ్చి..కూలి పోయింది..ఆ విమానంతో పాటే 35 కోట్ల భారతీయుల ఆశలూ నేల కూలాయి..స్వాతంత్ర్యం బిచ్చమడిగి తీసుకునే దానం కాదు..పోరాడి గెలుచుకునే హక్కు..అని నినదించి..చలో ఢిల్లీ అని గర్జించి..'' నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను..నాకు మీ రక్తాన్ని ఇవ్వండి..మీకు స్వతంత్రాన్ని ఇస్తాను..'' అని విశ్వాసం చివురింపజేసిన స్వతంత్ర పోరాట ధ్రువ తార నేల కూలింది..మెడ నుండి నడుము దాక తీవ్రంగా కాలిపోయి, సమీపం లోని హాస్పిటల్ లో వైద్య ప్రయత్నం జరిగినా..తీవ్రంగా మంటలలో కాలిపోయిన ఆయన ...18 -08 -1945 రాత్రి 8 .30 లకు కన్ను మూశారు!

సుభాష్ చంద్ర బోస్ బ్రతికి వుంటే..ఈ దేశ పరిస్థితి ఇప్పుడు ఇంకోలాగుండేది!!

శ్రీ కృష్ణ దేవరాయలు


 సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన కవి, పండిత పోషకుడే కాదు స్వయంగా కవి. పేరు వినగానే మనకందరికి గుర్తుకువచ్చేది ఆముక్తమాల్యద గ్రంథం. ఆయన మరెవరో కాదు..
"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,
దేశ భాషలందు తెలుగు లెస్స"..
అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు,విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు.
శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధవిజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు.
ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించేవాడు.కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.
రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు.
దక్షిణ దేశ దండయాత్రఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు, విజయనగర సామంతుడైన గంగరాజు, విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.తరువాత ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుని గా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు. విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించినాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండ మండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించినాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసినాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.
పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు భాగములుగా విభజించి నాడుజింజి కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు అధిపతిగా నెల్లూరు మొదలగు ప్రాంతములు ఉండెను.తంజావూరు కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములు రెండవ కేంద్రము.కొడగు కేంద్రముగా వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ ప్రాంతము మూడవ భాగము.ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.తూర్పు దిగ్విజయ యాత్రతిమ్మరుసు నాయకత్వంలో చక్కని సైన్యమును తూర్పు దిగ్విజయ యాత్రకు పంపించినాడు.
సైనిక విశేషములు
తిమ్మరుసు సైన్యమును చక్కగా వ్యూహాత్మకంగా విభజించినాడు. మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను కింది దళాలు ఉన్నాయి:
• 30,000 కాల్బలము
 • నాలుగు వేల అశ్విక దళము
 • రెండువందల ఏనుగులు
 ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని నియమించాడు.
 1. రాయసము కొండమరుసు
 2. పెమ్మసాని రామలింగ నాయుడు
 3. గండికోట కుమార తిమ్మానాయుడు
 4. వెలుగోడు గంగాధరరెడ్డి
 5. అకినీడు ఇమ్మరాజు
 6. ఆరవీటి నారపరాజు
 7. ఆరవీటి శ్రీరంగరాజు
ఉదయగిరి విజయం..
 ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరమున్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు.
కొండవీడు విజయం..
1515లో రాయలు కొండవీడు ను ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు. తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపన దుర్గాధిపతిగా నియమితుడయినాడు.
కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.
 • అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
 • విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.
 • అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.
 • కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరము లను జయించినాడు.
 • మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
 • కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవి ని వివాహమాడాడు.
 ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516 లో రాజధానికి తిరిగి వచ్చాడు.
బీజాపూరు దండయాత్ర..
1520లో బీజాపూరు పైకి దండయాత్రకు సిద్ధమయినాడు. దీనికి రెండు కారణములు చూపుతారు. మద్గల్లు, రాయచూరు దుర్గములను సుల్తాను ఆక్రమించుట మరియు సయ్యద్ మరైకర్ అను వ్యాపారి రాయల వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాలను ఇవ్వకుండా బీజాపూరు సుల్తాను దగ్గర ఆశ్రయం పొందినాడు; తాకీదు పంపించినా ఈ వ్యాపారిని సుల్తాను రాయలకు అప్పజెప్పలేదు, రాయలు సొమ్ము ఇప్పించనూ లేదు.
సైనిక వివరములు..
 న్యూనిజ్ అను పోర్చుగీసు యాత్రికుని ప్రకారం సైన్యం ఇలా ఉన్నది:
 1. కామా నాయకుడు (పెమ్మసాని రామలింగ నాయుడు) : 30,000 కాల్బలము, వేయి అశ్వములు, పదహారు గజములు
 2. త్రయంబకరావు: 50,000 కాల్బలము, రెండు వేల అశ్వములు, ఇరవై ఏనుగులు
 3. తిమ్మప్ప నాయకుడు : 60,000కాల్బలము, 3,500 ఆశ్విక దళము, 30 ఏనుగులు
 4. ఆదెప్ప నాయకుడు : లక్ష కాల్బలము, ఐదువేల ఆశ్విక దళము, 50 ఏనుగులు
 5. కొండమ రెడ్డి 1 : 1,20,000 కాల్బలము, 6000 గుర్రాలు, 60 ఏనుగులు
 6. కొండమ రెడ్డి 2 : 80,000 కాల్బలము, 2050 గుర్రాలు, 40 ఏనుగులు
 7. సాళువ గోవింద రాజు : 30,000 కాల్బలము, 1000 గుర్రాలు, 10 ఏనుగులు
 8. మధుర నాయకుడు : 15,000 కాల్బలము, 200 గుర్రములు
 9. కుమార వీరయ్య : 8,000 కాల్బలము, నాలుగు వందల గుర్రములు
 10. రాయలు : 44,000 కాల్బలము, 7,000 గుర్రములు, 315 ఏనుగులు
మొత్తం 5,37,000 కాల్బలము, 27,150 గుర్రములు, 1151 ఏనుగులు. పోరు భీకరముగా జరిగింది. ఇరువైపులా అనేక మంది నేలకూలారు. ఆదిల్ షా ఏనుగునెక్కి పారిపోయినాడు. సేనానులు దిక్కుతోచని వారైనారు. చివరకు ఎంతో ప్రాణ నష్టము తరువాత యుద్ధం 1520 మే 19న ముగిసింది. ఈ విజయం వలన రాయలుకు విశేషమైన డబ్బు, గుర్రాలు, ఏనుగులు లభించినాయి.
రాయచూరు యుద్ధము.. 
తరువాత రాయచూరు కోటను ముట్టడించి ఇరవై రోజులు యుద్ధం చేసి పోర్చుగీసు సైనికుల సహాయంతో విజయం సాధించాడు (రాయచూరి యుద్ధము). రాయలు రాజధానికి వెళ్ళినా, త్వరలోనే మరలా ముద్గల్లు, బీజాపూరు లను ముట్టడించి ధ్వంస పరచి కల్యాణి, గుల్బర్గా కోటలను స్వాధీనం చేసుకున్నాడు.
తరువాత రాయలు రాజధానికి వచ్చి నిశ్చింతగా కవితా గోష్టులను నిర్వహించినాడు.
• రాజ్య పాలన
 240 కోట్ల వార్షికాదాయము కలదు.
 సాహిత్య పోషకునిగా.. 
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
అష్టదిగ్గజములు..
1. అల్లసాని పెద్దన,
 2. నంది తిమ్మన,
 3. ధూర్జటి,
 4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),
 5. అయ్యలరాజు రామభద్రుడు,
 6. పింగళి సూరన,
 7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),
 8. తెనాలి రామకృష్ణుడు
ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
నిజానికి ఆయన తెలుగులో కన్నా సంస్కృతంలోనే ఎక్కువ గ్రంథాలు రాశాడు. ఆ మాట ఆయనే ఆముక్తమాల్యద గ్రంథంలో శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు మాటల ద్వారా చెప్పుకున్నాడు . భారీగా యుద్ధాలు చేసి అలసిపోయిన రాయలు తీర్థయాత్రలు చేశాడు. అపðడు ఆయన కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళానికి వచ్చాడు. అక్కడ ఆ రాత్రి విశ్రమించినపుడు ఆంధ్రదేవుడు కలలో కనిపించి ఆముక్తమాల్యద రాయమని ఆదేశించాడు. ఆ సందర్భంలో ఆంధ్రదేవుడు మాట్లాడుతూ
'పలికితుత్ప్రేక్షోపమలు జాతి పెంపెక్క రసికులౌనన 'మదాలస చరిత్ర'
 భావధ్వని వ్యంగ్య సేవధికాగ చెప్పితివి 'సత్యావధూ ప్రీణనంబు'
 శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి 'సకల కథాసార సంగ్రహంబు'
 శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తినైపుణి 'జ్ఞానచింతామణి' కృతి
అంతేగాక 'రసమంజరీ' ముఖ్య మధుర కావ్య రచన మెప్పించికొంటి గీర్వాణ భాష
 ఆంధ్ర భాష అసాధ్యంబె అందు ఒక్క కృతి వినిర్మిం పుమిక మాకు ప్రియము కాగఅంటాడు. ఈ పద్యం ప్రకారం రాయలు మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనంబు, సకల కథాసార సంగ్రహం, జ్ఞానచిం తామణి, రసమంజరీగ్రంథాలను రచించాడు. అయితే కాలగతిలో అవన్నీ కనుమరుగైపోయి ఒక్క ఆముక్తమాల్యద మాత్రమే దక్కింది. ఇవికాక జాంబవతీ పరిణయం అనే నాటకం కూడా రాశాడని అంటారు. కానీ అది కూడా దొరకడంలేదు.
రామాయణం, మహాభారతం, మహాభా గవతం, హరివంశం వంటి గ్రంథాలు సంస్కృత మూల గ్రంథాలకు అను వాదాలు. మక్కీకి మక్కీ అను వాదాలు కాకపోయినా, వా టిలోనూ కొన్ని స్వ కపోల కల్పన లున్నా గాస టబీసట గాథలుగా జనపదాలలో వినిపించే ప్రఖ్యాత కథలు తెలుగు గ్రంథాలలో చోటు సంపా దించుకున్నా, వాటిలో తెలుగు ముద్ర కంఠదగ్నంగా ఉన్నా వాటిని స్వతంత్ర రచనలు అన డానికి ఆస్కారంలేదు. తన హయాంలోనూ మను చరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, కళాపూర్ణోదయం వంటి రచనలు వెలువడినా వాటికి మూలకథలు సంస్కృత ప్రఖ్యాత కథలే కావడం గమనార్హం. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాదిలో ఎంతో ప్రఖ్యాతమైన కథను ఎన్నుకుని దానికి ప్రబంధోచిత హంగులన్నీ అద్ది ఆండాళ్‌చరిత్రకు అక్షర రూపమిచ్చాడు. వైష్ణవులకే పరిమితమైన ఆమె కథను తెలుగు వారందరికీ తెలిసేలా చేశాడు. ద్రవిడ సాహిత్యం లో చిరకీర్తులున్న మహానుభావులెందరో ఉన్నా వారి ఇతిహాసాలను పుస్తకాలకెక్కించిన పెద్ద కవులు తెలుగులో దాదాపుగా లేరంటే అతిశయోక్తికాదు. స్వయంగా వైష్ణవమతానుయాయుడైన రాయలు ఆండాళ్‌తల్లి మీద అభిమానం, శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆదేశంపై ఆ దేవుడు గోదాదేవిని పరిణయమాడిన గాథను ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఆంధ్రదేవుడు ఆదేశం ప్రకారమే ఈ గ్రంథాన్ని తిరుపతి వేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. ఈ పుస్తకంలో కథాప్రణాళికను రూపొందించు కో డానికి గురు పరం పరా ప్రభావం, ప్రపన్నామృతం, దివ్యసూరి చరిత్ర వంటి వైష్ణవ మత గ్రంథాలనే స్వీ కరించాడు. ఈ గ్రంథా నికి గోదా దేవి పేరు నేరుగా పెట్టినా, ఆరు ఆశ్వాశాల గ్రంథంగా దీన్ని విస్తరించినా ఆండాళ్‌ చరిత్ర 5వ ఆశ్వాసంలోనే ఆరంభమవు తుంది. మొత్తం 872 పద్యాలు సంతరించినా ఆండాళ్‌కు దక్కినవి 140 పద్యాలు మాత్రమే! ఈ గ్రంథంలో 5 విడి కథలు కనబడ తాయి. విష్ణు చిత్తుడికథ, ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం, యామునాచార్య వృత్తాం తం, గోదాదేవి వృత్తాంతం, చండాల, బ్రహ్మరాక్షసుల కథ ప్రధానంగా కనబడతాయి.
వారసులు..
• ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి .
 • ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలు కు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలు కు ఇచ్చి వివాహం చేసాడు.
• ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు . ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 26 మంది రాజుల్లో 1509 నుండి 1529 వరకు ఓటమి ఎరుగని చక్రవర్తిగా పాలన సాగించిన రాయలు తిమ్మరుసును గుడ్డివానిగా చేసాననే దిగులుతో మరణించారని చరిత్ర చెబుతోంది.
పై చిత్రంలో కనిపిస్తున్న శ్రీ కృష్ణదేవరాయల రూపును వెల్లడించే చిత్రపటం ఆచూకీ లభ్యమైంది. పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో ఈ చిత్రాన్ని గీశారు. రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారు. 
  తన తనువృత్తి విజయ నగర సామ్రాజ్య సీమల రక్షణంగా, తన మనః ప్రవృత్తి సరస సంగీత సాహిత్య సాంస్కృతిక సీమల వీక్షణంగా,విలక్షణ సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కారణ జన్ముడు శ్రీ కృష్ణ దేవరాయలు..కర్నాట ఆంధ్ర సీమలను పాలించినా,తెలుగు భాషపై,సంస్కృతిపై,ప్రజలపై ఎక్కువ మక్కువ చూపించిన మహానుభావుడు శ్రీ కృష్ణ దేవరాయలు! సమర విజయలక్ష్మికి తన శరీరాన్ని,సాహిత్య విద్యా లక్ష్మికి మనసును ఆత్మను కూడా అంకితం చేసిన వాడు శ్రీ కృష్ణ దేవరాయలు! ఒక్క చేతితో ముసల్మానులను,ఫ్రెంచి వారిని,డచి వారిని, పోర్చుగీసులను నిలువరించి , కేవలం ఇరవై సంవత్సరాలే పాలన చేసినా, చరిత్ర నిలిచి ఉన్నంత కాలము నిలిచిపోయే మహాద్భుతాలను అటు సమర రంగంలోనూ, ఇటు సాహిత్య రంగంలోనూ సాధించి,సంపూర్ణభారత దేశ చరిత్ర లోనే కాదు,ప్రపంచ చరిత్ర లో కూడా, ఇలాంటి చక్రవర్తులు చాల కొద్దీ మందే వున్నారు అని ప్రశంసలు పొందిన మహానుభావుడు!తన జీవిత కాలంలో ఒక యుద్ధంలో కూడా ఓడి పోని, నిరంతరము యుద్ధ రంగంలోనే గడిపిన ఏకైకచక్రవర్తి, శ్రీ కృష్ణ దేవ రాయలు!
నిజానికి, శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన అందించిన ఫలితాల కారణం గానే, ఈ నాడు ఆంధ్రభాషా, సాహిత్యం,సంప్రదాయం, కళలు మాత్రమే కాక భారతీయ ధర్మం, హైందవ ప్రదాయం,భారతీయ కళలు దక్షిణ భారత దేశంలో, విశేషించి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా నిలిచి వున్నాయి ఇతరమతాలకు, ధర్మాలకు, భాషలకు,దేశాలకు చెందిన వారిని అకారణంగాఏనాడూ ఇబ్బందులకు గురిచేయలేదు సరికదా,వేరే ధర్మాలకు చెందిన వారికి వారి మతాలకు సంబంధించిన ప్రార్ధనా కేంద్రాలను స్వయంగా కట్టించి ఇచ్చాడు, తను స్వయంగా వైష్ణవుడు ఐనా, శైవులను, మాధ్వులను, ఇతర శాఖలకు చెందిన వారిని ఆదరించాడు!ఆయన కాలంలో మరలా వైభవాన్ని పొందిన పౌరాణిక గాధలే ఈనాటికి ప్రబంధాలలో, కావ్యాలలో నిలిచి నేటి తరాలకు తరగనిఆధ్యాత్మిక,సాహిత్య,సాంస్కృతిక వారసత్వ సంపదను మిగిల్చాయి!
ఆంధ్ర సాహిత్యంలోని పంచ మహా కావ్యాలైన వాటిలో,ఆముక్తమాల్యదను ఆయన స్వయంగా రచిస్తే,మనుచరిత్రను ఆయన గురుతుల్యుడైన మిత్రుడు, ఆస్థాన కవి ఐన అల్లసాని పెద్దన రచించాడు, వసుచరిత్రనుఆయన కాలంలోని సాహిత్య ఉద్యమానికి ప్రేరితుడైన, పెద్దన శిష్యుడైన భట్టుమూర్తి అని పిలువబడిన రామరాజ భూషణుడు రచించాడు,పాండురంగ మహత్యమును అయన ఆస్థాన కవి ఐన తెనాలి రామకృష్ణుడు రచించాడు, ఒక శృంగార నైషధమును మాత్రము శ్రీనాధుడురచించాడు, కాని అది ఒక అనువాదం చేయబడిన గ్రంధం మాత్రమే కాని, ప్రధమంగా తెలుగులో రచించబడిన స్వతంత్ర కావ్యం కాదు!ఇది చాలు రాయల వారికీ ఆంధ్ర సాహిత్యానికీ ఉన్న సంబంధమును గురించి చెప్పడానికి!
కత్తి ఏదో ఒక నాడు లొంగి పోక దించక తప్పదు! కలం మాత్రం ఏనాడూ ఎవరికీ లొంగదు!నిరంతరమూతన ప్రభావాన్ని, ప్రతిభను వెలువరిస్తూనే వుంటుంది! రాజులు వెడలి పోతారు..కవి రాజులు నిలిచి పోతారు చరిత్రలో!రాజులూ రాళ్ళలో నిలిచి పోతారు కాని, కవి రాజులూ, కళాకారులు ప్రజల గుండెల్లో నిలిచి పోతారు..శ్రీ కృష్ణ దేవరాయలు మాత్రం రాజుగానే కాక, కవిరాజుగా, కళాకారునిగా,(ఆయన గొప్ప వీణా వాదకుడుట!) సంస్కర్తగా,ఆంధ్ర సారస్వత స్వర్ణ యుగ కర్తగా తెలుగుజాతి, భారత సంస్కృతి నిలిచి ఉన్నంత కాలమూ నిలిచి వుంటాడు!
జయహో శ్రీ కృష్ణ దేవ రాయ!
జయ నిత్య కీర్తి కాయా!
జయ కదన కవన రవి చంద్ర తేజ
జయ భువన విజయమున ఆంధ్ర భోజ .. 
నీ తనువు కదన ఘన విజయలక్ష్మికి
నీ మనువు కవనమున విజయలక్ష్మికి 
తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం
నీ ప్రవృత్తి సాహిత్య వీక్షణం..
చిన రాణి తాను సామ్రాజ్య లక్ష్మీ
పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మీ
చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి
పెద రాణి తోడి కల కాల కలిమి..
నడి వీధిలోన రతనాలు రాశి
నడి రేయి దాక కవనాలు దూసి
పడి కరకు తురక తలచెండ్లు కోసి
కడలేని కీర్తిగనినావు వాసి... 
గజపతుల కైన ఘన స్వప్న సింహమా!
మదవతులకైన శృంగార చిహ్నమా!
కవితా వధూటి సిగపువ్వు చంద్రమా!
తులలేని అలల సాహిత్య సంద్రమా!..
ఘన తెలుగు కవన ధారా విపంచి
పలికించి తేనెలొలికించి మించి
వలపించి చూడిక్కు డుత్త నాచ్చి
నేలించినావు రంగేశుకిచ్చి...
భువి రాజులెందు? శాసనములందు!
కవిరాజులెందు? ఉచ్చ్వాసమందు, 
జన జీవనాడి నిశ్వాసమందు!
నిలిచుండురందు, నువు.. గుండెలందు!..
బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి,
దైవతములందు శ్రీ వేంకటేశుడు,
పలు దేశభాషలను తెలుగు లెస్సరా!
రాజులందు..రాయ!నువు లెస్సరా!...