Thursday, August 23, 2012

ఘంటసాల వెంకటేశ్వర రావు




         తండ్రి: సూర్యనారాయణ తల్లి: రత్నమ్మ పుట్టిన తేది: 1922 డిసెంబర్ 4పుట్టిన ప్రదేశం:గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామముస్వర్గస్తులైన తేది: 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. తండ్రి సూర్యనారాయణ ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల తండ్రి గారు చివరి రోజుల్లో సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. 


            తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

             విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉన్నది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అనిచెప్పేవాడు.

              శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు. వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.




సినీ ప్రస్థానం:
               1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు. సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తనమకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు.భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది. తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.

విజయ విహారం:

               1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికిసాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావుచెపుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యంసినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.

చివరిదశ:

        1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.



వ్యక్తిత్వం: 

                ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు. "నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు. మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు. పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.

                                                     

  •                                      దారిలోన మజిలీ ఇట చేసిన గంధర్వుడు
                                        వున్నా లేకున్నా తను గుండె గుడుల దేవుడు
                                        షడ్రసాల రుచుల తెలుగు పాటల కది వంటశాల
                                        సరిగమలను స్వరఝరులను గొని పండిన పంటశాల
                                        తెలుగు చెవుల పంట ఖేల గళ లీల ఘంటసాల!
                                        దేవేంద్రుని కిపుడక్కడ ఘంటసాల గళ జోల!!!
  •                                             
                                         మల్లె తోటలలోన మనసైన గుసగుసలు
                                         బంగారి మావకై భామ విరహపు బుసలు
                                         అత్త కోడలి దుత్త మీగడల జగడాలు
                                         కొత్త కొత్తలు మనసు మాగాణి చిత్తడులు
                                         పండించు నివ్వరులు పాట పంటల సిరులు
                                         నిండించెనొక హలము ఘంటసాలది గళము!

  •                                              

                                          బహుదూరపు బాటసారి పాట తీపి ఖండసారి
                                          తెలుగు కోడలమ్మ సరోజమ్మ పాటలోని చెమ్మ
                                          పూల బాల బేల జాలి కథల వ్యధల కరుణ చిలుకు
                                          స్వచ్చమైన తెలుగు లోని ఉచ్చారణ తేనె చినుకు
                                          ఘంటసాల నీతోనే కనుమరుగయ్యింది నేడు
                                          ఒకరిద్దరు మినహా మిగిలింది మాకు హా.. తన్హా !!

  •                                                

                                            హంసధ్వని భూషిత హేరంబం తో ఆరంభం
                                            పల్లె పల్లె లో సినిమా హాళ్ళలోని సంరంభం
                                            దినకరా..శుభకరా..వినబడితే బిర బిరా
                                            సినిమాలకు వురికెళ్ళిన గురుతింకా పోదురా
                                            గుడిలోనూ నీ గొంతు బడిలోను అదే తంతు
                                            తెలుగు శ్వాస, రసపిపాస, నీ గొంతుక పై ధ్యాస!


  •                                                         

                                           కురుక్షేత్రమందు విందు గీతనందె నొక్క నరుడు
                                          ఈ నాడిటు ఇంటింటా గీతను విని ప్రతి నరుడు
                                          తానోడిన గెల్చిననూ నువు, గీత నిల్చునను
                                          గీతను వెలయించినదర్జును కోరకా నీ కొరకా?
                                          ఆ భాగ్యము నరునిదా?తెలుగు నెరుగు నరులదా?
                                          కృష్ణుడు,అర్జునుడు,గీత,ఘంటసాల పరులకా???

నాద బ్రహ్మ-శ్రీ త్యాగరాజ స్వామి

         



           ''ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు..' అనే పల్లవిని వినని, ఒక్కసారైనా సరదాగానైనా ఆ మాట అనని తెలుగువాడు వుండడు. శాస్త్రీయ సంగీత బాణీలోని ఒక కీర్తనలోని పల్లవిని జన బాహుళ్యం లోకి, ప్రజల హృదయాలలోకి ఒక సత్యాన్ని పలకడం ద్వారా తీసుకెళ్ళిన మహానుభావుడు నాదబ్రహ్మ గా కొనియాడబడిన త్యాగరాజస్వామి వారు!

           కర్ణాటక సంగీతంగా పిలువబడే దక్షిణ భారతదేశ శాస్త్రీయ సంగీత విధానానికి ఆద్యుడు పురందర దాసు అంటారు..కానీ త్యాగరాజస్వామి కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పితామహుడిగా గుర్తింపబడ్డారు.క్రీ.శ .04 -05 -1767 నాడు త్యాగరాజస్వామి వారు జన్మించారు, పురందర దాసు అంతకు 200 సంవత్సరాల క్రితం వారు.త్యాగరాజు,శ్యామ శాస్త్రి,ముత్తుస్వామి దీక్షితార్..ఈ ముగ్గురినీ కర్ణాటక సంగీత వాగ్గేయకార త్రయం అంటారు.వీరిలో త్యాగరాజస్వామి వారి పేరు పండిత పామరులకు అందరికీ తెలిసిన పేరు. త్యాగరాజస్వామి వారి పూర్వీకులు ఆంధ్రులే.కర్నూల్ జిల్లాలోని కాకర్ల గ్రామంనుండి తమిళనాడు లోని తంజావూరు దగ్గిరి తిరువారూరుకు వలస వెళ్ళారు, ఆయన ముత్తాత పంచనాద బ్రహ్మ గారి హయాములో.వారి కుమారుడు, త్యాగ రాజస్వామి వారి తాత ఐన గిరి రాజ బ్రహ్మ గొప్ప కవి, పండితుడు, తంజావూరు రాజాస్థానంలో సన్మానం పొందిన వారు. ఆయన కుమారుడు రామబ్రహ్మ, త్యాగరాజ స్వామి వారి తండ్రిగారు, గొప్ప పండితుడే కాక మహా రామ భక్తుడు, ఆయన ఇంట్లో నిత్యమూ రామ పంచాయతన పూజ చేసే వారు. ఆయన ధర్మ పత్ని, త్యాగరాజస్వామి వారి తల్లి సీతమ్మ కూడా రామభక్తురాలు. తంజావూరు రాజు తుల్జాజీ మహారాజు నిత్యమూ రామబ్రహ్మ గారిచేత రామాయణం వినిపించుకునే వారు. అటువంటి పరమ భక్తుల ఇంట పుట్టిన త్యాగరాజస్వామివారు శ్రీ రామ సాక్షాత్కారం పొందిన సాధకుడు.త్యాగరాజస్వామి వారికి ఇద్దరు అన్నలు.పంచనాద బ్రహ్మ,పంచాప కేశ బ్రహ్మ. పంచాపకేశ బ్రహ్మ యవ్వనంలోనే మరణించాడు.పెద్ద కుమారులు ఇద్దరూ చెడు అలవాట్లకు లోనై అపఖ్యాతి తెస్తే, ఆవేదనకు గురైన రామబ్రహ్మ తిరువారూరు లోని శివుడు త్యాగరాజ స్వామికి మొక్కుంటే పుట్టాడు కనుక మూడవ కుమారుడికి త్యాగరాజస్వామి అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి రామబ్రహ్మ సమీపంలోని తిరువాయూర్ కి వెళ్లి నివాసం ఏర్పరచుకున్నారు.

         ఐదు నదులు కావేరి,కొలరూన్,కోడమూరుతి,పెన్నార్,వేట్టార్..చట్టు ముట్టి ప్రవహిస్తున్న పుణ్యక్షేత్రం తిరువాయూర్.అక్కడి సంస్కృత పాఠశాలలోనూ, అక్కడి మహా విద్వాంసులు శోంఠి వేంకట రమణయ్య పంతుల వారి వద్ద సంగీత విద్యలోనూ అభ్యాసం చేశారు త్యాగరాజస్వామి వారు.ఆ రోజుల్లోనే రామక్రిష్ణానంద స్వామి అనే యోగి ఈయనకు రామతారకమును ఉపదేశించారు, ఆ తర్వాత నారదోవాస్తి అనే మంత్రం ఉపదేశించారు, స్వరార్ణవం అనే మహత్తర సంగీత కళా రహస్య నిధి ఐన పుస్తకాన్ని ఇచ్చారు. ఆయన నారద మహర్షి అవతారం అని త్యాగరాజ స్వామి వారి నమ్మకం. ఇంట్లో నిత్యమూ తల్లిదండ్రుల కు సహాయంగా రామసేవా కార్యక్రమం లో మగ్నులై సంగీత విద్వాంసురాలైన తల్లి అన్నమయ్య కీర్తనలను, భద్రాచల రామదాసు కీర్తనలను, క్షేత్రయ్య పదాలనూ పాడుతుంటే ఒకరోజు తను ఆశువుగా ''నమో నమో రాఘవాయ '' అనే కీర్తనను దేశి తోడి రాగం లో పాడి ఆనాటినుండి మొదలుకొని, 24000 కీర్తనలను రచించారని ప్రతీతి, కానీ ఇప్పుడు అన్నీ లభ్యములు కావు.తండ్రి మరణంతో,తల్లీ,తనూ, భార్యతో సామాన్య జీవనం కొనసాగిస్తున్న త్యాగరాజస్వామి వారు నిత్యం కావేరి తీరంలో శ్రీరామ షడక్షరీ మంత్ర జపం ఒక లక్షా ఇరవై ఐదు వేల సార్లు చేశే వారు, తర్వాత ఆ నది తీరంలో తన కీర్తనలు పాడుకుంటుంటే గ్రామ ప్రజలు వింటూ ఆనందించే వారు, ఇంట్లో నిత్య అర్చన, అనంతరం వాల్మీకి రామాయణం, పోతన భాగవత పారాయణం,పురందరదాసు కీర్తనలను పాడుకోవడం ఇవీ వారి దినచర్యలో భాగాలు.

              తంజావూర్ మహారాజు, మహారాజు స్వాతి తిరునాల్ వంటి రాజులూ, ఎందరో సంపన్నులు ఎన్ని రకాలుగా ఆహ్వానించినా ఏ నాడూ రాజాశ్రయం కొరకు యాచించని మహానుభావుడు. గణిత, జ్యోతిష, సంగీత విద్య విశారదుడు, మహా రామ భక్తుడు,సంప్రదాయం ప్రకారం నారద మహర్షి అవతారం, వాల్మీకి అవతారం త్యాగరాజస్వామి వారు. మొదటి భార్య పార్వతి కాలవశాత్తూ మరణించిన తర్వాత తన తల్లి బలవంతం మీద జీవిక కొనసాగించడానికి, గృహస్థ ధర్మాన్ని కొనసాగించడం కొరకు తన భార్య చెల్లెలు కమలమ్మను వివాహం చేసుకొని, ఒక కుమార్తెను కని, అమెకి 'సీతా మహాలక్ష్మి' అని పేరు పెట్టుకున్నారు!నిత్యం వీధులలో తన గాన రసప్రవాహం పారిస్తూ, యాచక వృత్తిలో వచ్చిన దానిలో తన కుటుంబాన్ని వెళ్ళదీసి , శిష్యులకూ భోజనం పెట్టి సంగీతం నేర్పారు!

          ఎందరు రాజులూ, చక్రవర్తులు ఆహ్వానించినా ఏ నాడూ గ్రామం దాటి వెళ్ళక, కంచి కామకోటి పీఠం ఆచార్యులవారు తాము కదలలేని స్థితిలో ఈయనను చూడాలనుకుంటున్నారు అని తెలిసి కంచి వెళ్లి దారి పొడవునా ఎందరో శిష్యుల, ప్రశిష్యుల అతిధిగా తమిళనాట తమ సంగీత గంగను పొంగించి, కంచిలో కొన్ని రోజుల బస తర్వాత తిరిగి వస్తూ తిరువక్తియూరు లో వీణా కుప్పయ్యర్ అనే ఒక శిష్యుని ఇంట బస చేసి, ఆ వూరి సంపన్నుడు ఒకడు ఈయన మీద భక్తితో కానుకలు ఇస్తే, ఆ శిష్యుడు ఈయనకు తెలియకుండా ఇతర శిష్యులకు బంగరునాణాల సంచిని ఇస్తే వారు పల్లకీలో దాచారు. తిరుగు మార్గంలో అడవిగుండా పల్లకీ వెళ్తున్నప్పుడు బందిపోట్లు దోచుకోవడానికి వస్తే మనదగ్గిర ఏముంది కనుక భయం అన్నారు త్యాగరాజస్వామి వారు.శిష్యులు అప్పుడు బంగరు నాణాల సంగతి చెప్పి, రామ సేవలో లోటు రాకుండా వుండడం కోసమని ఇస్తే తీసుకున్నామని చెప్పారు.అయితే రాముని సొమ్మును రాముడే కాపాడుకుంటాడు అని..ఇరుప్రక్కల తోడై రారా..అని కీర్తన పాడుకుంటుంటే రామలక్ష్మణులు ధనుర్ధారులై ఆ దొంగలను భయపెట్టి పారద్రోలారు. మర్నాడు వీరు బస చేసిన దగ్గిరకు ఆ దొంగలు వచ్చి క్రితం రాత్రి తాము చూసిన ఇద్దరు భటులను, వారి అంద చందాలను, వారి చేతులలోని విల్లంబులను, వారి లాఘవాన్ని పొగడుతుంటే, వారికి నమస్కరించి మీరే అదృష్టవంతులు..రామలక్ష్మణులను కళ్ళారా చూశారు అని ఆనంద బాష్పాలు రాల్చారు త్యాగయ్య. దారిలో తిరుపతిలో దర్శనానికి సమయం అయిపోయిందని అర్చకులు తెర వేస్తే, ''తెర తీయగరాదా..తిరుపతి వేంకట రమణ మత్సరమను తెర తీయగ రాదా'' అని కీర్తనను ఆలపిస్తే తెర దానంతట అదే తొలిగిపోయి స్వామి దర్శనం లభించింది త్యాగరాజ స్వామి వారికి. ఇలాంటివే ఎన్నో మహిమలను దర్శింప జేస్తూ ఇంటికి తిరిగివచ్చారు.ఇదొక్కటే ఆయన చేసిన యాత్ర గ్రామాన్ని విడిచి.

             ఈయన అన్న రాజుల ప్రాపకాన్ని వద్దంటున్నాడు అనే కోపంతో ఈయన పూజించుకునే రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్న, సీత, హనుమాన్ విగ్రహాలను కావేరిలో వేస్తే కావేరి వొడ్డునే శోకిస్తూ ప్రార్ధిస్తే, విగ్రహాలు వాటంతట అవే పైకి తేలాయి. ఆనందంతో ఉప్పొంగుతూ ''కనుగొంటిని శ్రీ రాముని నేడు'','';రారా మా యింటి దాక''..అని కీర్తనలను పాడుతూ మేళ తాళాలతో విగ్రహాలను ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి మరలా పూజలు ప్రారంభించారు.. ఈయన అన్నగారికి తమ తప్పుతెలిసి వచ్చి ఆయన కూడా శ్రీ రామ భక్తులైనారు. ఈయనకు కుమారులు లేనందున అన్నగారైన జప్యేషుని కుమారులే ఈయన స్మారక చిహ్నమైన సమాధి వద్ద పూజలు చేస్తున్నారు.. వారి సంతతి వారే ఇప్పటికీ ఆ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు.

       రెండవ భార్య కమలమ్మ మరణించిన తర్వాత, తీవ్ర వైరాగ్యానికి బాధకు గురి అయి,తము కూడా వెళ్లి పోవలసిన
సమయం వచ్చిందని తెలిసికొని, పుష్య శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రాత్రి పూజ,సంగీత సాధన, భోజనాలు
ఐన తర్వాత, శిష్యులకూ, అందరికీ, పుష్య బహుళ పంచమి నాడు తన ఇంటికి రమ్మని చెప్పి ..పుష్య బహుళ పంచమి నాడు 06 -01 -1847 నాడు పూజ, అర్చన, సంగీత సాధన ఐన తర్వాత , ఆపత్ సన్యాసం స్వీకరించి, శ్రీ రామనామజపం చేస్తూ సమాధిలోకి వెళ్లి, తమ ప్రాణాలను త్యజించారు. అందరి సమక్షంలో ఆయన కపాలం విచ్చుకొని, ఒక దివ్య జ్యోతి శ్రీ రామునిలో కలిసిపోయింది. తిరువయూరులో, అక్కడే ఆయనకు 'బృందావనం', సమాధి నిర్మించారు, ఈ నాడు తమిళనాడు లో ఆది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం.ఈ నాడు ఆయన జయంతి..ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు అన్న మహానుభావుని జయంతి ఉత్సవాల రోజుననే యాదృచ్చికంగా 'మన మహనీయులు' గ్రూప్ ప్రారంభింపబడి..ఆయనను గురించిన ఈ పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.

           త్యాగరాజస్వామి వారి కీర్తనలు బహు వేదాంత రహస్యాల సారాలు. ప్రపంచం మొత్తం శ్రీ రామ తత్త్వంతో నిండి వుందని భావించి సర్వత్రా శ్రీ రాముడినే దర్శించిన కారణ జన్ముడు..ఎక్కువగా తెలుగులోనూ,కొన్ని సంస్కృతం లోనూ కీర్తనలను రచించిన సంగీత శాస్త్ర రహస్య కళానిధి ఐన, నారద మహర్షి అవతారం ఐన శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనలను సంప్రదాయం ప్రకారమే, ఆయన నిర్దేశించిన రాగ,తాళ పద్ధతులలోనే సభ్యతగా, సంస్కార బద్దంగా ఆలపించడం, అలాగే ఆదరించడం మన కనీస కర్తవ్యం. దురదృష్ట వశాత్తూ తెలుగు సినిమాలలో, ఇతరత్రా ఆయన కీర్తనలను అక్కడక్కడా దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. దీనిని నిరసించాల్సిన అవసరం ఉన్నది.'

Source: Manamahaneeyulu-Facebook : https://www.facebook.com/groups/164573576982747/